Skip to main content
రాగి పాత్రల విశిష్టత
దైవ పూజలో తామ్ర పాత్ర (రాగి పాత్ర)లను ఎక్కువగా వాడుతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలీ ప్రశ్నను భూదేవే వరాహ రూపుడైన నారాయణుడిని తొలిగా అడిగింది. అప్పుడు రాగి అంటే తనకెందుకు ఇష్టమో ఇలా వివరించాడు ఆ నారాయణుడు.
రాగి పవిత్ర వస్తువులన్నిటిలోకీ పవిత్రమైంది. అది సంసారం నుంచి ముక్తిని కలిగిస్తుంది. దీక్ష తీసుకొన్న వారు, విశుద్ధులు అయిన వారు నారాయణుడికి సంబంధించి అన్ని కార్యాలలోనూ రాగినే ఉపయోగించాలి.
పూర్వం ఏడువేల యుగాల కిందట గుడాకేశుడు అనే ఓ మహా రాక్షసుడు రాగి రూపాన్ని ధరించి విష్ణువును ఆరాధిస్తూ ఉండేవాడు. కావటానికి మహా రాక్షసుడే కానీ గొప్ప భక్తుడతడు. పదహారు వేల ఏళ్ళ పాటు గుడాకేశుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి అతడున్న తామ్రాశ్రమం అనే ఆశ్రమానికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు. తపస్సుకు మెచ్చినట్లు చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షసుడు ఎంతో ధర్మబుద్ధితో, భక్తి ప్రపత్తులతో దేవదేవుడికి నమస్కరించి స్తుతి చేశాడు. తనకు వేరే భోగభాగ్యాలేవీ అక్కరలేదని, సుదర్శన చక్రంతో తన శరీరాన్ని ఛేదించి తన ప్రాణాలను విష్ణువులో కలుపుకోమన్నాడు. ఆ తర్వాత తన శరీరం విష్ణు పూజలో ఉపకరించాలని, దానితో చేసిన పాత్రలు నారాయణ పూజలో వాడే పవిత్ర వస్తువులు కావాలని కోరాడు ఆ రాక్షసుడు. శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడి కోర్కెను అనుగ్రహిస్తూ వైశాఖ శుక్ల పక్ష ద్వాదశినాడు మధ్యాహ్న సమయంలో తన సుదర్శన చక్రం ఆ రాక్షసుడి శరీరాన్ని ఛేదిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
గుడాకేశుడు నారాయణుడు చెప్పిన ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తూ నిరంతరం విష్ణు పదసేవలో నిమగ్నమవుతూ వచ్చాడు. ఆ క్షణం రానే వచ్చింది. భక్తుడు కోరిన కోర్కెను తీర్చింది. మహారాక్షసుడి ప్రాణాలు నారాయణుడిలో లీనమయ్యాయి. అతడి శరీర మాంసం అంతా రాగి అయింది. రక్తం తగరం గానూ, ఎముకలు బంగారంగానూ, మలినం కంచుగానూ అయింది.
తనలో లీనమవ్వాలని నిస్వార్థ భక్తితో భక్తుడు కోరిన కోర్కెను తీర్చేందుకే విష్ణువు రాగిని అంత పవిత్రమైనదిగా అనుగ్రహించాడు. రాగి పాత్రలో నివేదించిన ఒక్క మెతుకును స్వీకరించినా ఎన్నెన్నో జన్మల పాపం నశించి పుణ్యం ప్రాపిస్తుంది. అది శుద్ధాలలో శుద్ధం, మంగళాలలో మంగళం.
ఇక్కడ ఓ విషయం గమనించాల్సి ఉంటుంది. నిజంగా రాగి అనే లోహం అలాగే పుట్టిందా? మహారాక్షసుడైన వాడిని భగవంతుడు అనుగ్రహించమేమిటి? అనే తీరులో ఆలోచించకుండా హేతుబద్ధంగా ఆలోచించినా ఇక్కడ ఓ చక్కటి సందేశమే కనిపిస్తుంది. భగవంతుడైన నారాయణుడి దృష్టిలో సకల ప్రాణులూ సమానమే. గుడాకేశుడు వాస్తవానికి మహా రాక్షసుడే. అయితేనేమి రాక్షస సహజమైన దుర్మార్గాలకతడు పాల్పడకుండా కేవలం దైవభక్తితోనే జీవితాన్ని సాగించాడు. ఇతర రాక్షసులలాగా తీవ్రంగా తపస్సు చేసి దేవతలకు ఇబ్బంది కలిగించే వరాలనేవీ కోరుకోలేదు. తను మరణించినా, తన శరీరం కూడా దైవసేవకే ఉపకరించాలన్నాడు. తన ప్రాణాలు దైవంలోనే లీనమవ్వాలన్నాడు. ఇలాంటి భక్తితత్వాన్నే ఏ కాలంలోని భక్తులైనా కోరుకోవాలని సూచించటం ఇక్కడ కనిపించే సందేశం. ఈ కథంతా వరాహ పురాణం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-