Skip to main content

పెరియాళ్వార్ తిరునక్షత్రం 3-7-2017 సోమవారం 

భక్తియొక్క పరిపక్వ దష కలిగినవారు మన ఆళ్వార్లు, అందులో విష్ణుచిత్తులవారు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించింది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెళ్ళి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాళ్ళను ఆళ్వారులు అని అంటాం. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీళ్ళంతా.
 
తనియన్ :-
 
మిధునే స్వాతిజంవిష్ణోః రథాంశం ధన్వినః పురే |
ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురశ్శిఖమ్ ||
గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్
నరపతిపరిక్లుప్తం శుల్క మాదాతుకామః,
శ్వశుర మమర వన్ద్యంరఙ్గనాథస్య సాక్షాత్
ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి.
 
తిరునామములు :-
 పెరియాళ్వార్, శ్రీవిష్ణుచిత్తులు, పట్టరపిరాన్, భట్టనాథులు
 
ఈయన శ్రీవిల్లిపుత్తూర్లో వటపత్రశాయి మందిరంలో మాలాకారుడు. ఒక సారి ఆయనకు పాండ్య సభనుండి పిలుపు వచ్చింది. భగవంతుడి ఆజ్ఞచే విష్ణుచిత్తులవారు మదురానగరం వెళ్ళి పాండ్య రాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపించారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఇంతవరకు నీన్ను అంగీకరించని వీరి కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు.
 
భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తనో ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞాని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒక నాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈ నాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే.అందుకే మనం ఆళయాల్లో తలుపులు, తాలం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం. యావద్ ప్రపంచం అనే వృక్షానికి పరమాత్మ వేరు లాంటి వాడు, ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం అనేదే భావన. అంతే కాని అసలు దృష్టి దోశాలు ఉంటాయా, మగళం పాడితే అట్లా దృష్టి దోశాలు తొలగుతాయా, మనం భగవంతుడికి మంగళం పాడే యోగ్యులమా అనే విషయ ప్రస్తావన లేనే లేదు. అట్లాంటివి ఉన్నా లేకున్నా, ప్రేమాతిశయం చే భక్తులు చేసేవి మాత్రమే. అట్లా ఆనాడు ఆయన ఏనుగుపై అంబారీ ఊరేగుతుంటే శంఖ చక్ర ధారియై శ్రీమన్నారాయనుడు ప్రక్కన బంగారు ఆభరణాలతో అలంకృతమైన అమ్మ లక్షీదేవితో కలిసి కనిపించాడు.
 
"పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు
పలకోటి నూఱాయిరం
మల్లాండ తిణ్ణోళ్ మణివణ్ణా!
ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు"
"అడొయోమోడుం నిన్నోడుం పిఱివిన్ఱి ఆయిరం పల్లాండు
వడివాయ్ నిన్వల మార్భినిల్ వాల్ గిన్ఱ మంగైయుం పల్లాండు
వడివార్ శొది వలత్తుఱైయుం శుడరారియుం పల్లాండు
పడైపోర్పుక్కు ముళంగుం అప్పాంజశన్నియముం పల్లాండే" 
..

అంటూ స్వామికి మంగళం పాడాడు.
విష్ణుచిత్తులవారు పాడిన ఆ పల్లాండు పాటనే ఈనాటికి మన వైష్ణవ ఆలయాల్లో పాడటం ఆచారం. పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం. ఈ దాసులకు నీకు మధ్య ఎప్పటికీ వీడని బంధానికి మంగలం. నిన్ను ఎప్పటికి వీడని అమ్మ లక్ష్మీదేవికి మంగళం. శత్రువులని వణికించే నీ శంఖ,చక్రాలకు మంగళం అంటూ ఆయన పాడారు.
 
ఒకనాడు ఆయనకు ఒక పాప ఆ తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో, ఈయన తను యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు, ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి,అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. వాటిని ప్రబంధాలుగా లోకానికి అందించాడు.

అట్లాంటి మహనీయుల హృదయంలో స్వామి ఎల్లప్పటికీ ఉంటాడు. వారి ద్వారా మనం స్వామిని సేవించుకోవడం సులువు.
 
  

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-