వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ రోజునే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మోహినీ అవతార విశిష్టత తెలుసుకుందాం. 'మోహిని' అంటే మోహింపజేసేది అని అర్థం. హిందూ పురాణాలలో మోహిని అవతారం శ్రీమహావిష్ణువు ధరించిన అత్యంత విశిష్టమైన, ఏకైక స్త్రీ అవతారం.
మోహిని ఏకాదశి ఇలా వచ్చింది
శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం కర్పూర హారతిచ్చి నమస్కరించుకోవాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సంధ్యా సమయంలో తిరిగి పూజ చేసి క్షీరసాగర మథనం ఘట్టాన్ని, శ్రీహరి మోహిని అవతార విశిష్టతను పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే నిత్య పూజ పూర్తి చేసి ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.
ఈ దానాలు శ్రేష్టం
మోహిని ఏకాదశి రోజు పేదలకు అన్నదానం చేయడం మహా ఫలదాయకమని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మామిడి పండ్లు, జలదానం, ఛత్రం, పాదరక్షలు వంటివి కూడా దానం చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం ద్వారా సుమేరు పర్వతం అంతటి పాపాలు కూడా తొలగిపోతాయని, భక్తులు మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
Comments
Post a Comment