// శ్రీమతే రామనుజాయ నమః //
ఈ ఏడాది మే 2వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం.
రామానుజాచార్యులు జన్మ విశేషాలు
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు.
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త
దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.
ఆదిశంకరుల బాటలో పయనం
దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు.
విశిష్టాద్వైతమే సిద్ధాంతం
అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని, ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామానుజులు ప్రచారం చేసింది విశిష్టాద్వైతం అంటారు.
విశిష్టాద్వైతం ఎందుకు
ఆది శంకరుల వారు తమ కాలంలో ప్రబలంగా పాతుకొని పోయి ఉన్న ఆచారకాండలను ఖండించడానికి అద్వైతాన్ని ప్రచారం చేసారు. కానీ రామానుజుల కాలం నాటికి పరిస్థితులు మారిపోయాయి. హిందూ మతంను బౌద్ధ, జైన మతాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతంకు బదులుగా మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతంను ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వచ్చారు.
ఆదర్శవాది
రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరీ మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించే వారు. అంతే కాదు ఈ మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢ నమ్మకం కూడా ఆనాటి సమాజంలో ప్రబలంగా ఉండేవి.
జనహితమే తన మతం
రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం అందరి బాగు కోసం తానొక్కడు నరకాన్ని వెళ్లినా ఫర్వాలేదని ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్ధ పరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.
Comments
Post a Comment