దశపాపహర దశమి రోజు గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. కాశీలో స్నానమాచరిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. అంతా కాశీ వెళ్లలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి.
గంగాదేవి ఆరాధనకు ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ.ఈ రోజున శ్రీ గంగాష్టకం, శ్రీ గంగ స్తవః, శ్రీ గంగా స్తోత్రం చదువుకుంటే మంచిది.
ఇంతటి మాహాత్మ్యం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కాంద పురాణం
‘‘జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా
హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా!’’
అన్నది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం . పది పాపాలూ.. ఏమిటంటే.?
పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.
శారీరకంగా చేసే పాపాలు మూడు. అవి:
అపాత్రదానం
శాస్త్రం అంగీకరించని హింస చేయడం
పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం.
వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు. అవి:
పరుషంగా మాట్లాడడం
అసత్యం పలకడం
చాడీలు
వ్యర్థ ప్రలాపాలు చేయడం
సమాజం వినలేని భాషను ఉపయోగించడం.
మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు. అవి:
పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం.
స్నానం చేసేటప్పుడు ఈక్రింది శ్లోకం చదవాలి..
‘‘మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే!’’- అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. స్నానం చేశాక- పితృ తర్పణాలు, నిత్యానుష్ఠానాలను యథావిధిగా నిర్వర్తించాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో ‘‘నమశ్శివాయైు, నారాయణ్యై, దశపాపహరాయైు, గంగాయైు!’’ అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణీ, రుద్రుణ్ణీ, బ్రహ్మనూ, సూర్యుణ్ణీ, భగీరథుణ్ణీ, హిమవంతుణ్ణీ ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం.
Comments
Post a Comment